గులాబ్ తుఫాన్ పోయింది.. గులాబీ చీడ పోవాలి: సంజయ్
ABN , First Publish Date - 2021-09-30T00:57:30+05:30 IST
‘‘తెలంగాణ రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ పోయింది.. గులాబీ చీడ మాత్రం మిగిలే ఉంది. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే ప్రజా సంగ్రామ
సిద్దిపేట: ‘‘తెలంగాణ రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ పోయింది.. గులాబీ చీడ మాత్రం మిగిలే ఉంది. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాను’’ అని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపురం నుంచి కోహెడ వరకు ఆయన ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టారు. వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడిచారు. అనంతరం జరిగిన రోడ్షోలో సంజయ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద అపరిచితుడుగా మారాడని ఎద్దేవా చేశారు. తుపాకీ రాముడి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వరి సాగు విషయంలో బాధ్యత లేని సీఎంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో ఐదుగురు రైతుల మృతికి కారణమయ్యాడని సంజయ్ ఆవేదన చెందారు.