జీజీహెచ్‌కు.. ఖండాంతర ఖ్యాతి

ABN , First Publish Date - 2021-11-30T05:12:10+05:30 IST

దేశంలో పురాతన వైద్య కళాశాలల్లో ఒకటైన గుంటూరు మెడికల్‌ కాలేజీకి ఖండాంతర ఖ్యాతి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) తెలిపారు.

జీజీహెచ్‌కు.. ఖండాంతర ఖ్యాతి
శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి ఆళ్ల నాని

ఘనంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు 

రూ.500 కోట్లతో జీఎంసీ, జీజీహెచ్‌ అభివృద్ధి

పైలాన్‌ శంకుస్థాపనలో మంత్రి ఆళ్ల నాని

గుంటూరు(మెడికల్‌), నవంబరు 29: దేశంలో పురాతన వైద్య కళాశాలల్లో ఒకటైన గుంటూరు మెడికల్‌ కాలేజీకి ఖండాంతర ఖ్యాతి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) తెలిపారు. ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకల చిహ్నంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసే పైలాన్‌ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాల నిర్మించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా వచ్చే ఏడాది చరిత్రలో నిలిచేపోయేలా జీఎంసీ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమంలో  కళాశాల అభివృద్ధికి రూ.250 కోట్లు, అనుబంధ బోధనాసుపత్రి అభివృద్ధికి మరో రూ.250 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జీఎంసీలో వైద్య విద్యను అభ్యసించిన ఎందరో దేశ, విదేశాల్లో గొప్ప వైద్యులుగా రాణిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 21 రోజుల్లో నిధులు చెల్లించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో  హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కేఎస్‌ లక్ష్మణరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టీనా, మేయర్‌ కావటి శివనాగమనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీలా, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌,  డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు, జీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ పద్మావతిదేవి, జీజీహెచ్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ నాగేశ్వరమ్మ, జేసీ రాజకుమారి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, డాక్టర్‌ బీ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ రమణ యశస్వి, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, పశ్చిమ తహసీల్దారు వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ సాధు ఉమామహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌ షేక్‌ షౌకత్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-30T05:12:10+05:30 IST