నేడు మాలపల్లి నవల శతజయంతి
ABN , First Publish Date - 2021-12-05T05:58:43+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆదివారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞానకేంద్రంలో మాలపల్లి నవల శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సాహిత్య అకాడమి, అమరావతి సామాజిక అధ్యయన సంస్థలు తెలిపాయి.
కీలకోపన్యాసం చేయనున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీనివాస్
గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆదివారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞానకేంద్రంలో మాలపల్లి నవల శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సాహిత్య అకాడమి, అమరావతి సామాజిక అధ్యయన సంస్థలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ కీలకోపన్యాసం చేయనున్నారు. అలానే ఎమ్మెల్సీ, అమరావతి సామాజిక అధ్యయన సంస్థ వ్యవస్థాపకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు సలహాల మండలి, సాహిత్య అకాడమి సంచాలకుడు కె.శివారెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు కూడా ప్రసంగించనున్నారు. అలానే తేనీటి విరామం అనంతరం జరిగే సమావేశానికి పాపినేని శివశంకర్ అధ్యక్షత వహిస్తారు. వైఎస్ కృష్ణేశ్వరరావు(మాలపల్లి - తాత్విక, ప్రాపంచిక ధృక్పథం), పెనుగొండ లక్ష్మీనారాయణ(మాలపల్లి - సమకాలీన సమాజచిత్రణ), కొప్పర్తి వెంకటరమణమూర్తి(మాలపల్లి - కులరహిత సమాజచిత్రణ)కు సంబంధించి పత్రాలు సమర్పిస్తారు. భోజన విరామం అనంతరం జరిగే సమావేశానికి వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో కాత్యాయని విద్మహే(తెలుగు సాహిత్యంలో బృహన్నవలలు - మాలపల్లి స్థానం), పీసీ వెంకటేశ్వర్లు(మాలపల్లి - సాహిత్య విమర్శ), అట్లూరి మురళీ(అంటరానితనం - స్వాతంత్ర్యోద్యమ అవగాహన), రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి(ప్రత్యామ్నాయ ప్రాపంచిక ధృక్పథం - కక్కడు నుంచి జగ్గడు) పత్ర సమర్పరణ చేస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల మధ్యన జరిగే ముగింపు సమావేశానికి పీఏ దేవి అధ్యక్షత వహిస్తారు. ప్రజాకవి గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు హాజరౌతారని నిర్వాహకులు తెలిపారు.