ఏ బస్సు.. ఎక్కడో?

ABN , First Publish Date - 2022-08-07T06:10:51+05:30 IST

ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లో బస్సుల ప్లాట్‌ఫారంల గజిబిజి నెలకొంటోంది. ప్లాట్‌ఫామ్‌ల మార్పు, చేర్పులపై అధికారుల తీరు పట్ల ప్రయాణీకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏ బస్సు.. ఎక్కడో?
విజయవాడ సెక్టార్‌ బస్టాండ్‌

ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌ల గజిబిజి...

గతంలో పల్నాడు సెక్టార్‌ను విజయవాడ సెక్టార్‌గా 

విజయవాడ సెక్టార్‌లోకి అమరావతి బస్సులు

మళ్లీ అరైవల్‌ బ్లాక్‌లోకే అమరావతి ప్లాట్‌ఫామ్‌లు 

ప్రయాణికుల్లో గందరగోళం 

గుంటూరు, ఆగస్టు 6: ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లో బస్సుల ప్లాట్‌ఫారంల గజిబిజి నెలకొంటోంది. ప్లాట్‌ఫామ్‌ల మార్పు, చేర్పులపై అధికారుల తీరు పట్ల ప్రయాణీకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌టిఆర్‌ బస్టాండ్‌లోని ఆవరణలో గతంలో  మినీ బస్టాండ్‌గా నిర్మించి విజయవాడ సెక్టార్‌గా ఏర్పాటు చేశారు. ఆ తరువాత దాన్ని కాస్త పల్నాడు సెక్టార్‌గా మార్చి పల్నాడుకు మాచర్ల, వినుకొండ, నరసరావుపేట రాకపోకలు సాగించే బస్సుల ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. కొంతకాలానికి మరలా విజయవాడ సెక్టార్‌గా మార్చి విజయవాడ బస్సుల కోసం ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. కాగా గతంలో అరైవల్‌ బ్లాక్‌లో ఉన్న అమరావతి, తుళ్ళూరు, అచ్చంపేట బస్సులను విజయవాడ సెక్టార్‌లోని 44, 45, 46 ప్లాట్‌ఫారాలలోకి హైకోర్టు, సచివాలయం (వయా) తుళ్ళూరు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, మండేపూడి, తాళ్ళూరు, బేజాత్పురం, ముక్కామల రూట్ల బస్సులను మార్చారు. తాజాగా ఆయా సర్వీసులను మరలా అరైవల్‌ బ్లాక్‌లోకి ఈనెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ విజయగీత తెలిపారు. ఇలా మార్పులు చేయటంపై ప్రయాణీకుల్లో గందరగోళం నెలకొంటోంది. ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌లలోనూ స్వల్పమార్పులు చేశారు. ప్లాట్‌ఫారం 31లో ప్రస్తుతమున్న ముట్లూరు, మోదుకూరు బదులుగా బాపట్ల బస్సులకు, ప్లాట్‌ఫారం 32కు ప్రస్తుతమున్న బాపట్ల, చీరాల బదులుగా చీరా బస్సులను, 34లో తెనాలి(నాన్‌స్టాప్‌)తో పాటు ముట్లూరు, మోదుకూరు బస్సులకు కేటాయించారు.  

విజయవాడ సెక్టార్‌లో ప్లాట్‌ఫారాలు సరిపోకనే అమరావతి, తుళ్ళూరు, క్రోసూరు, అచ్చంపేట, బేజాత్పురం, ముక్కామల అరైవల్‌ బ్లాక్‌లోకి మార్పు చేసినట్లు ఆర్‌ఎం విజయగీత పేర్కొన్నారు.  

Updated Date - 2022-08-07T06:10:51+05:30 IST