రిటైర్మెంట్‌ ముందు కటకటాల వెనక్కు!

ABN , First Publish Date - 2021-04-23T10:41:01+05:30 IST

ఆయనో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌. పేరు యూవీ వెంకటరావు. విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పబ్లిక్‌ వర్క్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇంకో 8 రోజులుంటే...

రిటైర్మెంట్‌ ముందు కటకటాల వెనక్కు!

8 రోజులుంటే పదవీ విరమణ

ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఈఈ 


విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆయనో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌. పేరు యూవీ వెంకటరావు. విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పబ్లిక్‌ వర్క్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇంకో 8 రోజులుంటే... ఎంచక్కా పదవీ విరమణ చేసి ప్రశాంతంగా ఇంటిపట్టునే శేష జీవితాన్ని గడిపేందుకు సిద్ధపడుతున్నారు. అయితే విధి నిర్వహణలో లంచాలకు అలవాటు పడ్డారేమో... పదవీ విరమణకు గడువు సమీపిస్తున్న సమయంలోనూ కక్కుర్తి పడ్డారు.  అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. పదవీ విమరణ తర్వాత కృష్ణారామా అంటూ కాలం వెళ్లదీయడానికి బదులుగా శ్రీకృష్ణజన్మస్థానానికి వెళ్లిపోతున్నారు.


ఓ పనికి సంబంధించి బిల్లు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జీవీఎంసీ ఈఈ వెంకటరావు ఏసీబీకి పట్టుబడ్డారు. జీవీఎంసీ జోన్‌-8 పరిధిలో రూ.38 లక్షలతో వరదనీటి డ్రెయిన్‌ నిర్మాణానికి టెండర్లు పిలవగా రొంగలి అప్పలనాయుడు, అల్లు జగదీశ్‌ పనులు దక్కించుకున్నారు. పను లు కూడా పూర్తి చేశారు. ఆ జోన్‌లో ఈఈగా పనిచేస్తున్న యూవీ వెంకటరావు పరిశీలించి బిల్లు చెల్లింపునకు సిఫారసు చేయాల్సి ఉంది. అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో రూ.4 లక్షలు జీఎస్టీ కింద పోగా.. మిగిలిన రూ.34 లక్ష ల్లో  రూ.34 వేలు లంచం ఇవ్వాలని వెంకటరావు డిమాండ్‌ చేశాడు. దీంతో అప్పలనాయుడు ఏసీబీని ఆశ్రయించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో వెంకటరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Updated Date - 2021-04-23T10:41:01+05:30 IST