Gyanvapi case: జడ్జికి బెదిరింపు లేఖ
ABN , First Publish Date - 2022-06-08T20:40:18+05:30 IST
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో వీడియో సర్వే నిర్వహించేందుకు ఆదేశాలిచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్కు...
లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) కాంప్లెక్స్లో వీడియో సర్వే నిర్వహించేందుకు ఆదేశాలిచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్కు (Ravikumar Diwakar) బెదిరింపు లేఖ (Threat letter) వచ్చింది. ఈ విషయంపై ఆయన ఉత్తరప్రదేశ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇస్లామిక్ ఆగజ్ మూవ్మెంట్ తరఫున కాషిఫ్ అహ్మద్ సిద్ధిఖ్ అనే వ్యక్తి పేరుతో తనకు ఈ బెదరింపు లేఖ వచ్చినట్టు జడ్జి దివాకర్ ఒక లేఖలో అడిషన్ చీఫ్ సెక్రటరీ (హోమ్), డీజీపీ, వారణాసి పోలీస్ కమిషన్కు తెలియజేశారు. రిజిస్ట్రర్ పోస్టు ద్వారా దివాకర్కు బెదరింపు లేఖ వచ్చింది.
''జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ తనిఖీ సాధరణ ప్రక్రియేనని మీరు ఒక ప్రకటన చేశారు. వీరు విగ్రహారాధకులు, మీరు మసీదును ఆలయంగా ప్రకటించండి. ఒక కాఫిర్ నుంచి, ముస్లిం జడ్జి నుంచి సరైన నిర్ణయం వస్తుందని ఏ ముస్లిం కూడా అనుకోడు'' అని జడ్జికి వచ్చిన లేఖలో ఉంది. కాగా, జడ్జి దివాకర్కు బెదిరింపు లేఖ వచ్చిన విషయాన్ని వారణాసి కమిషనర్ సతీష్ గణేష్ ధ్రువీకరించారు. డీసీపీ వరుణ దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. 9 మంది పోలీసు సిబ్బందితో జడ్జికి భద్రత కల్పించామన్నారు.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో వీడియోగ్రఫీ సర్వేకు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) దివాకర్ గత ఏప్రిల్ 26న ఆదేశించారు. మే 19న సర్వే రిపోర్టు కూడా కోర్టుకు అధికారులు అందజేశారు. వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం లభ్యమైందని హిందూ వర్గాలు చెబుతుండగా, అది కేవలం వాటర్ పౌంటెన్ అని ముస్లిం కమిటీ సభ్యుల వాదనగా ఉంది.