Rainfall: రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

ABN , First Publish Date - 2022-09-13T18:04:04+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడేళ్లుగా వర్షాల ప్రభావం తీవ్రమైంది. 2019లో వర్షం కంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వరదతో ఉత్తరకర్ణాటక

Rainfall: రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

                          - తమిళనాడుకు భారీ స్థాయిలో నీటి విడుదల


బెంగళూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడేళ్లుగా వర్షాల ప్రభావం తీవ్రమైంది. 2019లో వర్షం కంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వరదతో ఉత్తరకర్ణాటక అతలాకుతలమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 51 ఏళ్లలో అత్యంత ఎక్కువ వర్షం ఈ ఏడాది నమోదయింది. ఆగస్టు రెండోవారం నాటికే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు భర్తీ అయ్యాయి. రాష్ట్రం నుంచి తమిళనాడుకు అత్యధిక నీరు విడుదలైంది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 దాకా 22 శాతం అత్యధిక వర్షం నమోదు కాగా ఇది 51 ఏళ్లలో అధికమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కావేరి నదికి అనుబంధమైన అన్ని జలాశయాలు నిండాయి. తమిళనాడు(Tamilnadu)కు 47 టీఎంసీల కావేరి నీరు అత్యధికంగా విడుదలైంది. 48 ఏళ్లలో ఇదే గరిష్టంగా ఉంది. మూడు నెలల్లో నైరుతి కాలంలో 844 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సరాసరిన 30 ఏళ్లలో 691 మిల్లీ మీటర్లుగా ఉంది. 1971లో అత్యధిక వర్షం కురవగా ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువ నమోదైంది. తమిళనాడులోని బిలిగుండ్లు జలాశయానికి 224 టీఎంసీల కావేరినీటిని ఈ ఏడాది విడుదల చేశారు. ఇది 1974 నుంచి పరిశీలిస్తే అత్యధికమని వాతావరణశాఖ డైరెక్టర్‌ మనోజ్‌ రాజన్‌ తెలిపారు. సాధారణంగా ఏటా 177.25 టీఎంసీల కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సి ఉండేది. ప్రస్తుతం 47 టీఎంసీలు అధికంగా విడుదల చేశారు. 2020లో ఆరుశాతం అత్యధికం వర్షం కురవగా, 2021లో 8 శాతం కొరత ఏర్పడింది. జూలై 1నుంచి ఆగస్టు 31 దాకా రాష్ట్రంలో 40 శాతం అత్యధిక వర్షం కురిసింది. దక్షిణ ప్రాంతంలో 151, ఉత్తరప్రాంతంలో 50, మలెనాడు ప్రాంతంలో 32 శాతం అత్యధిక వర్షపాతం కురిసింది. బెంగళూరు(Bengaluru)లో సెప్టెంబరు 1నుంచి 9వరకు 226 శాతం అత్యధిక వర్షం నమోదయింది. 

Updated Date - 2022-09-13T18:04:04+05:30 IST