పారదర్శకంగా ధరణి
ABN , First Publish Date - 2020-10-30T11:46:57+05:30 IST
భూముల రిజిస్ర్టేషన్ కోసం రైతులకు పైరవీలు లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలందించేందుకే ధరణి సేవలను ప్రారంభిస్తున్నామని కలెక్టర్ హన్మంతరావు తెలిపారు.
వచ్చే నెల 2 నుంచి సిటిజన్ పోర్టల్ సేవలు ప్రారంభం
కలెక్టర్ ఎం. హన్మంతరావు
మనోహరాబాద్, అక్టోబరు 29: భూముల రిజిస్ర్టేషన్ కోసం రైతులకు పైరవీలు లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలందించేందుకే ధరణి సేవలను ప్రారంభిస్తున్నామని కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆర్డీవో శ్యాంప్రకాష్, తహసీల్దార్ శ్రీదేవీతో కలిసి ధరణి పోర్టల్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 2 నుంచి సిటిజన్ పోర్టల్ సేవలను పూర్తి స్థాయిలో అందించనున్నట్లు వెల్లడించారు. ముందుగా కొనుగోలుదారులు, ఫౌతి, పార్టేషన్, గిఫ్ట్ ద్వారా ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్నీ తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, త్వరలో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్ సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు. తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ర్టార్లుగా సేవలందించనున్నారని వారికి సహాయకులుగా డీటీలు ఉంటారని చెప్పారు. అందుకు అవసరమైన సిబ్బంది, పరికరాల ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందన్నారు. భూముల వివరాలను పొందు పర్చుకునేందుకు ధరణి సేవలు నిరంతరంగా కొనసాగుతాయని చెప్పారు.