Hanumakonda Bjp Sabha: తెలంగాణ సీఎం కేసీఆర్పై జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం
ABN , First Publish Date - 2022-08-27T23:24:41+05:30 IST
పవిత్ర ఓరుగల్లుకు రావడం తన అదృష్టం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Chief Jp Nadda) అన్నారు. ఆర్ట్స్ అండ్...
హనుమకొండ (Hanumakonda): పవిత్ర ఓరుగల్లుకు రావడం తన అదృష్టం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Chief Jp Nadda) అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన 3 విడతల పాదయాత్ర విజయవంతమైందన్నారు. టీఆర్ఎస్ (Trs) పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను చీకటి నుంచి బయటపడేసేందుకే సంజయ్ పాదయాత్ర చేపట్టారని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ను సాగనంపడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. బీజేపీ సభకు అడుగడుగునా ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. 144 సెక్షన్ బూచి చూపి జనం రాకుండా అడ్డుకున్నారని.. హైకోర్టు అనుమతితో సభ నిర్వహించుకుంటున్నామని జేపీ నడ్డా తెలిపారు.
‘‘తెలంగాణను నయా నిజాం దోచేస్తున్నారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు. ప్రజలు త్వరలోనే కేసీఆర్ను ఇంటికి పంపిస్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంలా మారింది. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారు. ఇన్ని రోజులైనా ఆస్పత్రి నిర్మాణం జరగలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) కింద తెలంగాణకు కేంద్రం 3,500 కోట్లు కేటాయింపు. తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్లో భయం మొదలైంది.’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.