Rajaiah Verses Srihari: అధికార టీఆర్ఎస్లో రేగిన చిచ్చు దేనికి సంకేతం?
ABN , First Publish Date - 2022-08-31T01:36:15+05:30 IST
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాజీ మంత్రి కడియం శ్రీహరి పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో ఓ కార్యక్రమంలో...
హనుమకొండ: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah), మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య... కడియం శ్రీహరిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీహరి టీడీపీలో మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగింది స్టేషన్ఘనపూర్ నియోజకవర్గంలోనే అని కామెంట్ చేశారు. సుమారు 361 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ పేరుతో చంపించిన వ్యక్తి కడియం శ్రీహరి అని వ్యాఖ్యానించారు.
అయితే రాజయ్య వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. రాజయ్య మతిస్థితిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని కడియం పేర్కొన్నారు. రాజయ్య అవినీతిపై ఆధారాలు బయటపెడితే గ్రామాల్లో తిరగలేడని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని పాటిస్తూ తాను మౌనంగా ఉంటున్నానన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎవరి అడ్డానో సర్వే చేయిస్తే తేలుతుందని, ఈ సవాల్కు స్పందించాలని డిమాండ్ చేశారు.
అటు కడియం మాటలపై రాజయ్య మండిపడ్డారు. ‘‘కడియం శ్రీహరి నాపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నా. రాజకీయాల్లోకి రాకముందు నా ఆస్థులెంత? కడియం ఆస్థులెంత? బడా కాంట్రాక్టర్ను పట్టుకుని హనుమకొండలో బడా బంగ్లా కట్టుకున్నాడు. కడియం అవినీతి ఆరోపణలపై ఖల్ నాయక్ పుస్తకం వచ్చింది. శ్రీహరి చీకటి జీవితం గురించి అప్పటి టీడీపీ కార్యకర్తలను అడిగితే చెప్తారు. కడియం శ్రీహరి నక్సలైట్లను చంపారని నేను విమర్శించలేదు. కడియం శ్రీహరి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ అధిష్టానం అన్నీ గమనిస్తుంది.’’ అని చెప్పారు.
ఈ నేపథ్యంలో ‘‘స్టేషన్లో మాటల తూటాలు ఎందుకు పేలుతున్నాయి?. ఒకే పార్టీలో ఉన్న నేతలు ఇద్దరూ ఎందుకు రోడ్డెక్కుతున్నారు?. అధికార టీఆర్ఎస్లో రేగిన ఈ చిచ్చు దేనికి సంకేతం?. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోందా?. బీజేపీలోకి దూకేందుకు రెడీ అవుతున్న టీఆర్ఎస్ నేత ఎవరు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..