సమస్యల వలయంలో హనుమాన్నగర్
ABN , First Publish Date - 2021-10-24T05:02:41+05:30 IST
మున్సిపల్ ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం తప్ప వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారం కావడంలేదని ప్రజలు వాపోతున్నారు.
అధ్వానపు రోడ్లతో ఇక్కట్లు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ప్రొద్దుటూరు అర్బన్, అక్టోబరు 23 : మున్సిపల్ ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం తప్ప వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కారం కావడంలేదని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో దుస్థితిని అధికారులు కానీ పాలకమండలి కానీ పట్టించుకుంటున్న దాఖలాలు లేవని ఆవేదన చెం దుతున్నారు. మూడేళ్ల కిందట మున్సిపల్ అధికారులు అప్పటి 37వ వార్డు ప్రస్తుతం 39వ వార్డు హనుమాన్నగర్లో తాగునీటి సమస్య ను తీర్చడానికి పైపులైన్ వేశారు. ఈపైప్లైన్ తవ్వకాల వల్ల హనుమాన్నగర్లోని పలు వీధుల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఏడునెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్లరుగా పోటీ చేసి రోడ్లు బాగు చేస్తామని హామీలిచ్చి.. గెలిచాక అటువైపు చూడటం లేదు. అలాగే వార్డులో డ్వాక్రా మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి గతంలో కమ్యూనిటీ భవనం వుండేది. ఆభవనంలో ఇప్పుడు సచివాయం నిర్వహిస్తున్నారు. హనుమాన్ దేవాలమం వద్ద కూడా గతంలో నీళ్లట్యాంక్, అంగన్వాడీ భవనం వుండేది. వాటిని తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించారు తప్ప అందులో సామాజిక భవనం నిర్మించలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ సామాజిక భవన నిర్మాణానికి టెండర్లు కూడా నిర్వహించారు. కాంట్రాక్టర్ నిర్మించక పోవడం వల్ల నిలిచిపోయింది. దీంతో సామాజిక అవసరాలకు కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. కానీ నేడు హనుమాన్ టెంపుల్కు ప్రహరీని చందాలు వసూలు చేసి నిర్మించటం తప్ప మున్సిపాలిటీ నుంచి ఒక్కరూపాయి నిధులు మంజూరు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా హను మాన్నగర్లో కొత్త రోడ్లు, కమ్యూనిటీ భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.