PAK ఫ్యాన్స్పై హర్భజన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-11-07T02:40:08+05:30 IST
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలైన టీమిండియా ఆ తర్వాత వరుసగా
న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలైన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండుమ్యాచుల్లో విజయం సాధించి సెమీస్ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ రెండు మ్యాచుల్లోను కోహ్లీ సేన విజయం వెనక ‘ఫిక్సింగ్’ ఉన్నట్టు పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. సెమీఫైనల్ రేసులో నిలిచేందుకు భారత జట్టు ఫిక్సింగ్ చేసుకుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
భారత జట్టు అకస్మాత్తుగా పుంజుకోవడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్న పాక్ ఫ్యాన్స్ భారత జట్టుపై నిందలు మోపుతున్నారు. అబుదాబిలో ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్ను భారత జట్టు ఫిక్స్ చేసుకుందని ఆరోపిస్తున్నారు. పాక్ అభిమానుల బురద జల్లుడు కార్యక్రమంపై స్పందించిన టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాన్ని కట్టిపెట్టాలని హితవు పలికాడు.
పాకిస్థాన్ చాలా మంచి క్రికెట్ ఆడిందని, ప్రతి ఒక్కరు అందుకు అభినందిస్తున్నారని పేర్కొన్నాడు. భారత్పై గెలిచినందుకు అభినందనలని, కానీ మీరు గెలిస్తే అది ఫెయిర్ క్రికెట్, మేం గెలిస్తే ఫిక్సింగ్ అని చెప్పడం సరికాదని అన్నాడు. పాక్ క్రికెటర్ల ప్రతిష్ఠ ఏపాటిదో తమకు తమకు తెలుసని చురకలంటించాడు.
భారత జట్టు విజయాలను పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నాడు. ప్రశ్నలు లేవనెత్తేందుకు కూడా ఓ పద్ధతి ఉంటుందన్నాడు. తమపైనా, రషీద్ ఖాన్పై ఆరోపణలు చేయడం చాలా చవకబారుతనమని, అవమానకరమని హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.