గెడ్డం శ్రీను హత్య కేసును పునర్విచారించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:29:38+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడి స్టేషన్‌ పరిధిలో గత ఏడాది అక్టోబరులో జరిగిన మలకపల్లి గ్రామానికి చెందిన గెడ్డం శ్రీనివాసరావు(22) హత్య కేసును పునర్విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

గెడ్డం శ్రీను హత్య కేసును పునర్విచారించాలి

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21: పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడి స్టేషన్‌ పరిధిలో గత ఏడాది అక్టోబరులో జరిగిన మలకపల్లి గ్రామానికి చెందిన గెడ్డం శ్రీనివాసరావు(22) హత్య కేసును పునర్విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం రాజీవ్‌ గాంఽధీ విద్యాసంస్థల్లో  శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గెడ్డం శ్రీనును గోపరాజు సత్యనారాయణ, గోపరాజు ముత్యాలు అనే కౌలు రైతులు 2021 అక్టోబరు 6న  పనికి తీసుకెళ్లి పొలంలో తీవ్రంగా కొట్టి, పురుగుల మందు పట్టించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు బాగా సహకరించారని ఆరోపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ప్రకారం శ్రీనివాసరావు శరీరంలో పురుగుల మందు అవశేషాలున్నాయని, ఇది హత్యకాదు ఆత్మహత్య అని పోలీసులు చిత్రీకరించారని తెలిపారు. అయితే హైకోర్టు జోక్యంతో పోలీసులు కదిలారని చెప్పారు. ఆత్మహత్యగా మార్చేందుకు పోలీసులు, పెత్తందార్లు కలిసి ఎఫ్‌ఎస్‌ఎల్‌, పోస్టుమార్టం రిపోర్టులు మార్చేసారని చెప్పారు.  దీనిపై కోర్టు జోక్యం చేసుకునే వరకు ఈ కేసును హత్య కేసుగా పోలీసులు మార్చలేదని చెప్పారు. అట్రాసిటీ కేసులో వచ్చే పరిహారం రూ.4.10 లక్షలను కూడా ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నిస్తే దానిని ఒక మంత్రి చేతుల మీదుగా ఇచ్చి బాధితుడికి మేలు చేసినట్టు ప్రభుత్వం రంగు పులిమిందన్నారు. శ్రీను హత్య కేసు విషయంలో బాధితులకు ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ఈ కేసు విచారణ జరిపిన నర్సాపురం డీఎస్పీ, తాళ్లపూడి ఎస్‌ఐలను తొలుత సస్పెండ్‌ చేసి అటుపై కేసు రీఇన్వెస్ట్‌గేషన్‌ చేయాలని  డిమాండ్‌ చేశారు. శ్రీను మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించాలని, ఈ శాంపిల్స్‌ను ఓ మెడికల్‌ కాలేజీ టీమ్‌తో పరీక్ష చేయించాలని, ఇదంతా ఒక వీడియో చిత్రీకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-01-22T05:29:38+05:30 IST