Harshakumar: జగన్ ఆంధ్రప్రదేశ్ అని మార్చుకోండి..

ABN , First Publish Date - 2022-09-26T18:14:47+05:30 IST

రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఈనెల 28న కొత్తపేట నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు.

Harshakumar: జగన్ ఆంధ్రప్రదేశ్ అని మార్చుకోండి..

రాజమండ్రి (Rajahmundry): రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు మద్దతుగా ఈనెల 28న కొత్తపేట నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్ (Harshakumar) తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) దళితుల పట్ల వివక్ష చూపుతుందని ఆరోపించారు. సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం జరిగి రెండున్నర ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని విమర్శించారు. హోంమంత్రి సొంత గ్రామమైన పోచవరంలో దళిత యువకుడ్ని ఉరివేసి హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయలేదన్నారు. అమలాపురంలో సర్పంచ్ భవానీ ఆత్మహత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయలేదని, పోలీసులు నిందితుల నుంచి ముడుపులు తీసుకుని దళితుల  కేసులను నీరుగార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ యాత్రను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఎన్టీఆర్ (NTR) పేరు మార్చటం బాధాకరమన్నారు. అన్ని పేర్లు మార్చటం కన్నా జగన్ ఆంధ్రప్రదేశ్ (Jagan Andhra Pradesh) అని మార్చుకోండన్నారు. వచ్చే ప్రభుత్వం అన్ని పేర్లను రద్దు చేసేస్తుందని హర్షకుమార్ అన్నారు.


జగన్ ప్రభుత్వం రైతుల గురించి ఏమీ ఆలోచన చేయడంలేదని, అందుకే రైతులు రుణగ్రహీతలు అయిపోయారని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మూడు లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రకటించారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తారని, విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ కూడా ప్రైవేట్ పరం కాదని రాహుల్ ప్రకటించారన్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని హర్షకుమార్ పిలుపిచ్చారు. 

Updated Date - 2022-09-26T18:14:47+05:30 IST