హార్వెస్టర్‌, వ్యాన్‌ ఢీ కొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-05-07T05:42:27+05:30 IST

హార్వెస్టర్‌, వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

హార్వెస్టర్‌, వ్యాన్‌ ఢీ కొని ఒకరి మృతి
హార్వెస్టర్‌, వ్యాన్‌ ఢీకొన్న దృశ్యం, (ఇన్‌సెట్‌లో) దొంతి రాజు(ఫైల్‌)

 ఇద్దరికి గాయాలు.. విఠలాపూర్‌ శివారులో ఘటన

 చిన్నకోడూరు, మే 6: హార్వెస్టర్‌, వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే  మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని విఠలాపూర్‌ శివారులో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగాయిపల్లికి చెందిన దొంతి రాజు(31) సిరిసిల్ల మార్కెట్‌కు కూరగాయలు తరలిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రెడ్డి కుంటపల్లికి చెందిన బంధువులు  చందు, అశోక్‌లతో కలిసి వ్యాన్‌లో విఠలాపూర్‌ నుంచి రంగాయిపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో విఠలాపూర్‌ శివారులోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న హార్వెస్టర్‌, వ్యాన్‌  ఢీకొన్నాయి. ప్రమాదంలో  రాజు అక్కడికక్కడే మృతి చెందగా,  చందుకు తలకు తీవ్ర గాయమైంది. కాగా అశోక్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చందును చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో సిద్దిపేట జనరల్‌  ఆసుపత్రికి తరలించారు. చిన్నకోడూరు పోలీసులు రాజు మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య కరుణ, తల్లి, తల్లి, దండ్రులు ఉన్నారు. 

Updated Date - 2021-05-07T05:42:27+05:30 IST