ఇస్లాంపై ట్వీట్ చేసిన బీజేపీ హర్యానా ఐటీ సెల్ ఇన్ఛార్జి... పార్టీ నుంచి బహిష్కరణ...
ABN , First Publish Date - 2022-07-08T18:45:28+05:30 IST
భారతీయ జనతా పార్టీ (BJP) హర్యానా ఐటీ సెల్ ఇన్ఛార్జి
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) హర్యానా ఐటీ సెల్ ఇన్ఛార్జి అరుణ్ యాదవ్ను ఆ పార్టీ బహిష్కరించింది. ఐదేళ్ళ క్రితం ఆయన ఇస్లాం, ప్రవక్త మహమ్మద్ (Prophet Mohammad)లపై వివాదాస్పద ట్వీట్ చేశారని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. అయితే ఆయనను బహిష్కరించడానికి కారణాలేమిటో ఆ పార్టీ ప్రకటించలేదు.
హర్యానా బీజేపీ కార్యదర్శి గుల్షన్ భాటియా (Gulshan Bhatia) విడుదల చేసిన ప్రకటనలో అరుణ్ యాదవ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఓపీ ధన్కర్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.
యాదవ్ 2017లో ఇచ్చిన ట్వీట్ వైరల్ అయింది. ఆయనపై ఫిర్యాదులేవీ దాఖలు కాలేదు. కానీ ఆయనను అరెస్టు చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. #ArrestArunYadav దాదాపు 1.3 లక్షల ట్వీట్లతో ట్విటర్లో ట్రెండింగ్లో ఉంది.
యువజన కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఇచ్చిన ట్వీట్లో బీజేపీ మరొక చిల్లర వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించిందన్నారు. ఇటువంటి కంటి తుడుపు చర్యలు కాకుండా విద్వేషాన్ని ప్రోత్సహించేవారిని అరెస్టు చేయాలన్నారు.
టిప్పు సుల్తాన్ పార్టీ అధ్యక్షుడు షేక్ సాదిక్ ఇచ్చిన ట్వీట్లో, 2018లో ఇచ్చిన ట్వీట్పై ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబెయిర్ను అరెస్టు చేసినపుడు, అరుణ్ యాదవ్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఢిల్లీ, హర్యానా పోలీసులను ప్రశ్నించారు.