Haryana MC ఎన్నికలు.. ఇస్మయిలాబాద్లో AAP, జింద్లో BJP
ABN , First Publish Date - 2022-06-22T21:13:58+05:30 IST
హర్యానా రాష్ట్రంలోని 18 మున్సిపల్ కౌన్సిల్స్కు, 28 మున్సిపాలటీలకు కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. మెజారిటీ వార్డులను..
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని 18 మున్సిపల్ కౌన్సిల్స్కు, 28 మున్సిపాలటీలకు కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. మెజారిటీ వార్డులను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకోగా, బీజేపీ ఆ తర్వాత స్థానంలో నిలిచింది. 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) సైతం ఖాతా తెరిచి తమ ఉనికిని చాటుకుంది. బీజేపీ 19 మున్సిపల్ కౌన్సిల్స్కు గాను 10 మున్సిపల్ కౌన్సిల్స్ను (Prsident posts) సొంతం చేసుకుంది. బీజేపీ గెలుపొందిన కౌన్సిల్స్లో గోహనా, జింద్, ఝజ్జర్, బహదూర్గఢ్, ఛర్ఖి దాద్రి, కల్కా, సోహనా, కైతాల్, పల్వాల్, ఫతేహాబాద్ ఉన్నాయి. ఇస్మయిలాబాద్లో ఆప్ అభ్యర్థి విజయం సాధించాడు.
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ సొంత నియోజకవర్గమైన కర్నాల్లోని తరౌరి, అస్సాంథ్లో బీజేపీ ఓటమిని చవిచూసింది. ఘరౌండ మున్సిపల్ కమిటీని కేవలం 31 ఓట్ల తేడాతో బీజేపీ గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కురుక్షేత్ర జిల్లాలోని ఇస్మయిలాబాద్ మున్సిపల్ కమిటీ పోస్ట్ను సొంత చేసుకుంది. బీజేపీ-జేజేపీ ఉమ్మడి అభ్యర్థి పూజా గార్గ్పై ఆప్ అభ్యర్థి నిషా కనో వాంగాం 101 ఓట్ల తేడాతో గెలిచారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ-జేజేపీ కలిసి పోటీ చేశాయి. ప్రధాన పోటీ బీజేపీ-జేజేపీ కూటమి, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని సర్వేలు అంచనాలు వేశాయి. ఢిల్లీ, పంజాబ్ తర్వాత హర్యానాలో కూడా ఆప్ ప్రభావం ఉండవచ్చని సర్వేలు అంచనాలు వేశాయి.