ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దొంగిలించింది : హర్యానా మంత్రి

ABN , First Publish Date - 2021-04-21T21:16:20+05:30 IST

హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఢిల్లీ రాష్ట్ర

ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దొంగిలించింది : హర్యానా మంత్రి

న్యూఢిల్లీ : హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీ గుండా ఫరీదాబాద్ వస్తున్న ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్ళిందని ఆరోపించారు. అప్పటి నుంచి హర్యానా రాష్ట్రానికి వస్తున్న అన్ని ఆక్సిజన్ సిలిండర్ల వాహనాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించామన్నారు. 


అనిల్ విజ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హర్యానాలోని ఫరీదాబాద్‌కు వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదానిని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం దొంగతనం చేసిందన్నారు. ఇకపై అన్ని ట్యాంకర్లకు పోలీసు రక్షణ ఉండాలని ఆదేశించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే, ఇక ఆరోగ్య సంరక్షణ రంగంలోని మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని చెప్పారు. 


అనిల్ విజ్ హర్యానా హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం గమనార్హం. హర్యానాకు ఆక్సిజన్ తగిన స్థాయిలో ఉందని, ఢిల్లీకి ఆక్సిజన్‌ను పంపించడానికి సుముఖంగా ఉన్నామని, అయితే రాష్ట్ర అవసరాలను తీర్చుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ‘‘మా ఆక్సిజన్‌ను ఢిల్లీకి ఇవ్వాలని మాపై ఒత్తిడి వస్తోంది’’ అని చెప్పారు. 


హర్యానా మంత్రి ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ స్పందన తెలియవలసి ఉంది.


Updated Date - 2021-04-21T21:16:20+05:30 IST