ఉడత ఊపులకే తెగిందా?
ABN , First Publish Date - 2022-07-01T08:01:26+05:30 IST
ఉడత ఊపులకే తెగిందా?
ప్రమాదానికి ఉడత కారణమంటున్న విద్యుత్ శాఖ
ఆధునికీకరణలో నాసిరకం వైర్లు వాడకం.. నిర్వహణ
లోపం వల్లే ప్రాణాలు పోయినట్టు అనుమానాలు
పుట్టపర్తి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఆటోపై విద్యుత్ వైరు తెగిపడి, ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమైన సంఘటనలో తమ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు విద్యుత్శాఖ ఉడతను కారణంగా చూపడం విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ లైన్పై ఉడత సంచరిస్తూ, మరో లైన్ను తాకినందుకే (క్రాసారం) వైరు తెగిందని సీఎండీ వెల్లడించారు. అయితే.. ఉడత ఊపులకే విద్యుత్ వైరు తెగిందంటే నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారో అర్థమవుతోందని పలువురు పెదవి విరుస్తున్నారు. హెచ్వీడీఎ్స పథకం పైలెట్ ప్రాజెక్టు కింద తాడిమర్రి మండలంలో విద్యుత్ ఆధునికీకరణ పనులు చేశారు. ఇందులో భాగంగా ఆ మండలంలోని దాడితోట సబ్స్టేషన్ పరిధిలోని చిల్లకొండయ్యపల్లి ఫీడర్ కింద రెండునెలల కిందట లైన్ ఆధునికీకరణ చేశారు. ఈ పనులు అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్, తమిళనాడుకు చెందిన ఓ సబ్ కాంట్రాక్టర్తో చేయించారని తెలిసింది. ఆ సమయంలో నాసిరకం విద్యుత్ వైర్లను కాంట్రాక్టర్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో.. ఒక చిన్న ఉడత తాకితే వైరు ఎలా తెగుతుందని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదా.. అని ప్రమాద బాధిత కుటుంబాలవారు ప్రశ్నిస్తున్నారు. కాగా, ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యుత్శాఖ అనంతపురం సూపరింటెండెంట్ను ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశించారు. మృతులకు రూ.ఐదు లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.రెండు లక్షలు చొప్పున పరిహారం ప్రకటించి, సీఎండీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.