విద్వేషం.. విధ్వంసం!

ABN , First Publish Date - 2022-06-20T08:36:26+05:30 IST

విద్వేషం.. విధ్వంసం!

విద్వేషం.. విధ్వంసం!

ఉమ్మడి విశాఖలో టీడీపీ నేతలే టార్గెట్‌

‘అక్రమం’ పేరుతో నిర్మాణాల కూల్చివేతలు

గతంలో సబ్బం, ఇతర నేతల ఆస్తులు 

గీతంపైనా దాడి.. ప్రవేశ ద్వారం కూల్చివేత

నేడు అయ్యన్న ఇంటిపైకి.. అన్నీ ఆదివారం తెల్లవారుజామునే 


ప్రాంతం.. ఉమ్మడి విశాఖ జిల్లా. లక్ష్యం.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నాయకులు. ముహూర్తం.. సెలవు రోజు ఆదివారం. ఆ రోజు రాగానే ఆయా నేతల ఇళ్ల వద్దకు జేసీబీలు దూసుకొస్తాయి. అక్రమ కట్టడాల పేరుతో వారికి సంబంధించిన నిర్మాణాలు, ప్రవేశద్వారం, గోడలు కూల్చివేయడం.. ఇదీ వైసీపీ సర్కారు తంతు. మాజీ ఎంపీ సబ్బం హరి భవనం మొదలు.. తాజాగా మాజీ మంత్రి అయ్యన్న ఇంటిపై అదే దాడి. 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అధికార వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లాలో మళ్లీ దాడులు మొదలెట్టింది. టీడీపీ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి భవనాలను కూలగొడుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖలో ప్రతిపక్షంలో బలమైన నాయకులను దెబ్బతీయడానికి వరుసగా వారి నివాసాలు, వాణిజ్య సముదాయాలపై పడింది. సెలవు దినమైన ఆదివారం తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు, జేసీబీలను పంపి నిర్మాణాలను కూలగోడుతోంది. తొలుత సీనియర్‌ నాయకుడైన సబ్బం హరి అధికార పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని ఆయనపై కక్ష గట్టింది. సీతమ్మధారలో ఆయన నిర్మించుకున్న భవనంలో జీవీఎంసీ పార్కుకు చెందిన ఆరు అడుగుల వెడల్పు మేర స్థలం కలిసిపోయిందంటూ, అందులో ఉన్న వాచ్‌మన్‌ బాత్‌రూమ్‌ను కూలగొట్టించింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసినబాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయంపై పడింది. అందులో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ప్రధాన ప్రవేశద్వారం కూలగొట్టించింది. కొన్ని ఎకరాల భూమిని మార్కింగ్‌ చేసి, అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడైన హర్షవర్ధన్‌ సిరిపురంలో వీఎంఆర్‌డీఏకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ పేరుతో హోటల్‌ నడుపుతుండగా దీపావళి రోజున బలవంతంగా ఖాళీ చేయించింది. హోటల్‌లో వంట పాత్రలతో సహా ఫర్నీచర్‌ను పది లారీల్లోకి ఎక్కించి, దానికి తాళాలు వేయించింది. నోటీసు కూడా ఇవ్వకుండా ఇదేమి అన్యాయమని ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశం మేరకు ఏడాదిన్నర తరువాత మళ్లీ ఆయనకు అప్పగించారు.


పార్టీలోకి రాలేదని కూల్చివేత 

విశాఖ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపించారు. తాను పార్టీ మారబోనని ఆయన  స్పష్టం చేశారు. దీంతో కక్ష గట్టి గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని జీవీఎంసీ సిబ్బందితో కూలగొట్టించారు. దానిపై ఆయన కోర్టుకు వెళ్లారు. అక్కడితో ఆగకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఆయన భూములు ఆక్రమించారని ఆరోపిస్తూ వాటిలో నిర్మాణాలను కూలగొట్టారు. ఆ భూములు పల్లా శ్రీనివాసరావుకు చెందినవి కావని, తమవని అక్కడి వారు చెబుతున్నా వినిపించుకోలేదు. దాంతో సదరు బాధితులు కోర్టుకు వెళ్లారు.


భయపడి అధికార పార్టీలోకి..

గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడిగా పేరొందిన బొడ్డేటి కాశీ విశ్వనాథం భీమిలి సమీపాన కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని అందులో గోకార్టింగ్‌ నిర్వహిస్తున్నారు. అందులో ప్రభుత్వ భూమి ఉందని ఆరోపిస్తూ దానిని కూడా ఓ ఆదివారం తెల్లవారుజామున భిన్నాభిన్నం చేశారు. దాంతో ఆయన భయపడి తన వ్యాపార అవసరాల కోసం వైసీపీ కండువా కప్పుకొన్నారు. అదేవిధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద డాబాగార్డెన్స్‌లో వాణిజ్య సముదాయం నిర్మిస్తుండగా, ప్లాన్‌ ప్రకారం లేదని ఆరోపిస్తూ దానిని కూడా ఆదివారం రోజునే కూలగొట్టారు.  


అయ్యన్న ఇంటిపై దాడి

ఇటీవల తెలుగుదేశం పార్టీ చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడు విజయవంతం కావడం, ఆ సభలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులను అయ్యన్నపాత్రుడు విమర్శించడంతో ఆయనపై కక్ష గట్టారు. రెండు సెంట్ల స్థలం ఆక్రమించారంటూ చాలా ఏళ్ల క్రితం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శివపురంలో నిర్మించుకున్న ఇంటి ప్రహరీని ఆదివారం తెల్లవారుజామున కూలగొట్టారు. తమ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసి, మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ ఇలా వ్యవహరిస్తోందని, దీనిని ఎదుర్కొని తీరతామని అయ్యన్న కుటుంబీకులు ప్రకటించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. 


రెవెన్యూ, పోలీసుల శాఖలదే కీలక పాత్ర

టీడీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ పెద్దలు.. అందుకు రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు శాఖలను విస్తృతంగా వాడుకుంటున్నారు. భూమి అయితే రెవెన్యూ అధికారులను, భవనం అయితే మున్సిపల్‌ సిబ్బందిని ముందుంచి కథ నడుపుతున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శనివారం రాత్రి ప్లాన్‌ చేసుకొని, ఆదివారం తెల్లవారుజామున వందల సంఖ్యలో పోలీసులను తీసుకువెళ్లి వారు అనుకున్న పని పూర్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-06-20T08:36:26+05:30 IST