మీ పోరాట స్ఫూర్తికి హ్యాట్సాఫ్!
ABN , First Publish Date - 2020-12-03T07:43:50+05:30 IST
‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడానికి మీరు చేసిన పోరాటం అద్భుతం. హ్యాట్సాఫ్’’ అని బీజేపీ కార్యకర్తలపై ప్రధాని మోదీ ప్రశంసల
బీజేపీ కార్యకర్తలకు ప్రధాని ప్రశంసలు
సంజయ్కు ఫోన్.. ప్రత్యేకంగా అభినందనలు
జీహెచ్ఎంసీ పోలింగ్ సరళిపై అమిత్షా ఆరా
హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడానికి మీరు చేసిన పోరాటం అద్భుతం. హ్యాట్సాఫ్’’ అని బీజేపీ కార్యకర్తలపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘తెలంగాణ ప్రజానీకానికి పోరాట పటిమ ఉంది. అందుకే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నరు. గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గట్టి పోరాటం చేశారు. తక్కువ సమయంలోనే ప్రచారం చేసి, ప్రజల్లోకి వెళ్లడం సంతోషం. కార్యకర్తలదే ఈ గొప్పదనం. అందుకే వారికి మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు చెబుతున్నా’’ అన్నారు. ఇదే స్ఫూర్తితో ధైర్యంగా ముందుకు సాగుతూ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చేసిన మోదీ 10 నిమిషాలు మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ కేడర్ కొత్త ఉత్సాహంతో పనిచేయడాన్ని ప్రశంసించారు. సంజయ్ను మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్షా సైతం మంగళవారం రాత్రి సంజయ్కి ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్ సరళిపై ఆరా తీసిన ఆయన.. బాగా పని చేశారంటూ అభినందించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా వచ్చిన స్పందన చూస్తేనే తనకు నమ్మకం ఏర్పడిందని, టీఆర్ఎ్సపై ఎంత వ్యతిరేకత ఉందో అప్పుడే తెలిసిందని వ్యాఖ్యానించారు
. ఇకముందు కూడా ఇదే పంథా కొనసాగించాలని సూచించారు. ఎక్కడా వెనకడుగు వేయొద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
కాగా, ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో కమలం కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.