చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్నాడు.. కొన్ని తాయిత్తులు ఇచ్చి..!
ABN , First Publish Date - 2022-08-07T21:10:44+05:30 IST
చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని..
రూ.25 వేలు వసూలు..
శిష్యుడ్ని పట్టుకోవడంతో తిరిగిచ్చిన గురువు
పెనుగంచిప్రోలు : చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన గోర గోపి అనే వ్యక్తి మండలంలోని తోటచర్ల గ్రామానికి చెందిన ఒకరికి మాయమాటలు చెప్పి రూ.25 వేలు తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తోటచర్లకు చెందిన కోండ్రు సుధాకర్ అనారోగ్యంతో జూన్ 2న మృతి చెందాడు. 15 రోజుల క్రితం సోది చెపుతామంటూ గోర గోపి అనేవ్యక్తి తోటచర్లకు వచ్చాడు. చనిపోయిన మీ భర్తను బతికిస్తానని లక్ష ఖర్చవుతుందని మృతుడి భార్య వెంకట్రావమ్మకు చెప్పాడు. రూ.50 వేలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్గా రూ.5 వేలు తీసుకుని కొన్ని తాయిత్తులు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆగస్టు 2న అతడి శిష్యుడు పస్తం రెడ్డయ్య తోటచర్లకు వచ్చి మిగిలిన 20 వేలు తీసుకెళ్లాడు. మిగిలిన రూ.30 వేల కోసం శనివారం శిష్యుడు వచ్చాడు. మోటార్ సైకిల్ను గ్రామానికి దూరంగా పెట్టి వెంకట్రావమ్మ ఇంటి పరిసరాల్లో అనుమానంగా తిరుగుతున్నాడు. అది గమనించిన బాధితురాలి బంధువులు అతడ్ని పోలీసులకు అప్పగించారు. వెంకట్రావమ్మ నుంచి తీసుకున్న డబ్బును గురువు తిరిగి ఫోన్ పే చేశాడు. తన శిష్యుడ్ని ఎవ్వరూ కొట్టవద్దని, తాను తోటచర్ల రాలేనని ప్రాధేయపడ్డాడు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.