నేటి నుంచి పల్లెల్లో ఆరోగ్య పరీక్షలు
ABN , First Publish Date - 2021-05-15T04:54:29+05:30 IST
మండలంలో శనివారం నుంచి అన్ని గ్రామాల్లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఏఎన్ఎం, ఆశావర్కర్, అంగన్వాడీ, వలంటీర్ల బృందం గ్రామాల్లో తిరగనున్నారు.
విజయనగరం రూరల్, మే 14: మండలంలో శనివారం నుంచి అన్ని గ్రామాల్లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఏఎన్ఎం, ఆశావర్కర్, అంగన్వాడీ, వలంటీర్ల బృందం గ్రామాల్లో తిరగనున్నారు. కలెక్టర్ హరిజవహర్లాల్ ఆదేశాల మేరకు శుక్రవారం ఎంపీడీవో ఏవీ చైనులు సంబంధిత విభాగ అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో ర్యాపిడ్ టెస్ట్లు చేయాలని, జ్వరంతో బాధపడుతున్న వారికి అక్కడిక్కడే మందులు ఇవ్వాలని సూచించారు. కరోనా అని నిర్ధారణ అయితే అక్కడి నుంచే డాక్టరుతో మాట్లాడి.. హోం ఐసోలేషన్లో ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు గాను మెడికల్ కిట్ను తీసుకెళ్లాలని తెలిపారు. మొత్తంగా ఈ నెల 15 నుంచి 31 వరకూ మండలంలోని అన్ని గ్రామాల్లో రెండు దఫాలుగా ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.