వరవరరావు పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

ABN , First Publish Date - 2022-07-13T07:44:52+05:30 IST

ప్రముఖ కవి వరవరరావు(83)కు శాశ్వత మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసే విషయమై మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

వరవరరావు పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

న్యూఢిల్లీ, జులై 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి వరవరరావు(83)కు శాశ్వత మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసే విషయమై మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయనకు తాత్కాలిక రక్షణ కింద బాంబే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర మెడికల్‌ బెయిల్‌ను పొడిగించింది. భీమా కోరేగాం-ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన వీవీ ప్రస్తుతం అనారోగ్య కారణాల దృష్ట్యా మఽధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. దాని గడువు పూర్తయి మంగళవారమే పోలీసులకు లొంగిపోవాల్సి ఉండడంతో మధ్యంతర బెయిల్‌ను కూడా  పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఉభయ పక్షాల న్యాయవాదులు చేసిన విజ్ఞప్తి మేరకు కేసు విచారణను వాయిదా వేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తున్నామని జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌, భట్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.  19వ తేదీన తొలి కేసు కింద దీని విచారణను చేపడుతామని తెలిపింది. 

Updated Date - 2022-07-13T07:44:52+05:30 IST