గుండె గు‘బిల్లు’
ABN , First Publish Date - 2021-12-01T06:21:09+05:30 IST
కరెంట్ బిల్లు రెండొందలు దాటితేనే పేదలు షాక్కు గురవుతారు. అటువంటిది ఆరు లక్షల 59 వేల 190 రూపాయలు వస్తే గుండె గు‘బిల్లు’మనాల్సిందే!
నిరుపేదరాలికి ఈపీడీసీఎల్ షాక్
రెండు లైట్లు, ఫ్యాన్, టీవీకి రూ.6,59,190 బిల్లు
లబోదిబోమంటున్న బాధితురాలు
బుచ్చెయ్యపేట, నవంబరు 30: కరెంట్ బిల్లు రెండొందలు దాటితేనే పేదలు షాక్కు గురవుతారు. అటువంటిది ఆరు లక్షల 59 వేల 190 రూపాయలు వస్తే గుండె గు‘బిల్లు’మనాల్సిందే! మండలంలోని వడ్డాది గ్రామంలో నివాసం ఉంటున్న ఓ నిరుపేద కుటుంబానికి ఇదే అనుభవం ఎదురైంది. ఓ చిన్న ఇంటిలో రెండు లైట్లు, ఒక ఫ్యాన్, టీవీ వినియోగిస్తున్న వారికి నవంబరు నెలకు సంబంధించి రూ.6.59 లక్షల బిల్లు రావడంతో తేరుకోలేకపోతున్నారు.
వడ్డాది గ్రామానికి చెందిన మల్లి రత్నం భర్త చనిపోవడంతో కుండలు చేసుకుంటూ చిన్నపాటి ఇంటిలో కుమారుడితో కలిసి ఉంటుంది. ఒక ఫ్యాన్, రెండు లైట్లు, ఒక టీవీ తప్ప మరేతర విద్యుత్ వినియోగ పరికరాలు లేవు. ప్రతి నెలా విద్యుత్ బిల్లు రూ.100 నుంచి రూ.150 వస్తుంటుంది. అక్టోబరు నెలలో రూ.90 బిల్లు రాగా, నవంబరు నెలకు రూ.6,59,190 బిల్లు వచ్చింది. అక్టోబరు నెల 10వ తేదీకి 7850 యూనిట్లు విద్యుత్ ఖర్చు చేయగా, నవంబరు 13వ నాటికి ఏకంగా 70,975 యూనిట్లు వినియోగించినట్టు బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు చూడగానే ఆమె గుండె ఆగినంత పనైంది. బిల్లు తీసుకుని విద్యుత్ కార్యాలయానికి వెళ్లి రెండు లైట్లు, ఒక ఫ్యాన్, టీవీకి ఇంత బిల్లు ఎలా వేశారంటూ అధికారులను నిలదీసింది. దీనికి స్పందించిన వడ్డాది ఏడీఈ వేణుగోపాల్ మీటర్లో సాంకేతిక లోపం ఏర్పడి ఉంటుందని, రెండు రోజుల్లో తనిఖీ చేస్తామని చెప్పారు. ఈ నెలకు బిల్లు ఫెండింగ్లో ఉంచుతామనని, మీటర్ సరిచేశాక కొత్త బిల్లు జారీ అవుతుందని ఆయన చెప్పారు.