భారీగా పట్టుబడిన కర్ణాటక మద్యం

ABN , First Publish Date - 2022-08-18T04:17:25+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పెద్ద మొత్తంలో పట్టుబడింది.

భారీగా పట్టుబడిన కర్ణాటక మద్యం
పట్టుపడిన మద్యం కాటన్లు

రెండు కార్లలో ఒకదాన్ని తప్పించిన పోలీసులు?


కేటీదొడ్డి, ఆగస్టు 17: జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పెద్ద మొత్తంలో పట్టుబడింది. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపి, మద్యాన్ని పట్టుకున్నారు. గ్రామానికి చెందిన వెంకన్నగౌడ్‌ ఇంటి నుంచి రెండు వాహనాల్లో(ఇన్నోవా, స్విఫ్ట్‌) కర్ణాటక మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నం జరుగుతుండగా, గమనించిన కొంతమంది టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రెండు వాహనాలను, వాటిలో తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో మద్యం ఉన్న ఇన్నోవా వాహనాన్ని తప్పించి, స్విఫ్ట్‌ వాహనంలోని 20 కాటన్‌ బాక్సుల్లో ఉన్న మద్యాన్ని, వాహనాన్ని కేటీదొడ్డి పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. 


పోలీసులు ఏమంటున్నారు

కేటీదొడ్డి పోలీసుల కథనం ప్రకారం.. పాతపాలానికి చెందిన వెంకన్నగౌడ్‌ రాయచూరు నుంచి కర్ణాటక మద్యాన్ని రాష్ట్రంలోకి రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మార్గం మధ్యలో తనిఖీలు నిర్వహించగా, 20 మద్యం కాటన్లతో వెళ్తున్న స్విఫ్ట్‌ వాహనం పట్టుపడింది. 20 కాటన్‌ బాక్సుల్లో ఉన్న మద్యం విలువ రూ.67,200 ఉంటుంది. మద్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంకన్నగౌడ్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ఏఎస్‌ఐ జిక్కిబాబు తెలిపారు.


Updated Date - 2022-08-18T04:17:25+05:30 IST