మేడిగడ్డకు భారీ వరద

ABN , First Publish Date - 2022-07-06T08:40:27+05:30 IST

పశ్చిమ కనుమల్లో రెండు మూడు రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాణహిత నదికి భారీగా వరద వస్తోంది.

మేడిగడ్డకు భారీ వరద

  • బ్యారేజీలోకి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • 75,890 క్యూసెక్కులు విడుదల
  • పలు జిల్లాల్లో మోస్తరు వానలు
  • రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు పడే చాన్స్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పశ్చిమ కనుమల్లో రెండు మూడు రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాణహిత నదికి భారీగా వరద వస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మంగళవారం ప్రాజెక్టులోకి 60,530 క్యూసెక్కుల వరద రాగా.. 30 గేట్లను ఎత్తి 75,890 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 9.39 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ(తుపాకులగూడెం)కి 67 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని వదిలిపెడుతున్నారు. సీతమ్మసాగర్‌(దుమ్ముగూడెం) బ్యారేజీకి 32,873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో ఉంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 12,963 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1070 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీకి 11,581 క్యూసెక్కుల వరద వస్తోంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 36,917 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో.. ఒక గేటు ఎత్తి గోదావరిలోకి 3,084 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 12,684 క్యూసెక్కులు, తుంగభద్రకు 22,536 క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా, పశ్చిమ కనుమల్లోని కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరో వారం రోజుల్లో కృష్ణా, గోదావరి నదులకు ఎగున నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


3 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.కాగా,  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వానలు కురిశాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.   జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 3.49 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోరుట్లలో 7.2 సెం.మీ, మెట్‌పల్లిలో 7 సెం.మీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో 2.21 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా జన్నారం మండలంలో 5.54 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2022-07-06T08:40:27+05:30 IST