తమిళనాడు,ఆంధ్రప్రదేశ్లలో నేడు భారీవర్షాలు...IMD issues red alert
ABN , First Publish Date - 2021-11-27T13:34:08+05:30 IST
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కార్యాలయం తెలిపింది...
చెన్నై: వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కార్యాలయం తెలిపింది. ఈ వాయుగుండం సోమవారం నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శనివారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పక్కనే ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నవంబర్ 29వతేదీ వరకు తమిళనాడులోని తూత్తుకుడి, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తేని, మధురై, పుదుక్కోట్టై, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్లో తెలిపింది.
భారీవర్షాల నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.కొమోరిన్ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరాలలో తుపాను ప్రభావం ఉందని, తమిళనాడు తీరం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్లలో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ‘‘ ఈ అల్పపీడనం మరింత ఉధ్దృతమై తరువాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది’’ అని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
కొమోరిన్ ప్రాంతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుపాను ప్రభావం వల్ల గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ ట్విట్టరులో సూచించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలు, యానాం, రాయలసీమల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.