కనిగిరిలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-10-24T07:20:54+05:30 IST
కనిగిరితో పాటు నియోజకవర్గంలోని పీసీపల్లి, సీఎ్సపురం, హనుమంతునిపాడు మండలాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షం ఎంతో లాభదాయకమని వ్యవసాయశాఖ ఏవో రఫీక్ తెలిపారు.
కనిగిరి, అక్టోబరు 23: కనిగిరితో పాటు నియోజకవర్గంలోని పీసీపల్లి, సీఎ్సపురం, హనుమంతునిపాడు మండలాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షం ఎంతో లాభదాయకమని వ్యవసాయశాఖ ఏవో రఫీక్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో వేసిన మెట్ట పైర్లుతో పాటు వరిపైరుకు కూడ ఈ వర్షం ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. 54.4 మి.మీ వర్షపాతం వల్ల పట్టణంలోని భూగర్భ జలాలు కూడ పెంపొందే అవకాశం ఉందన్నారు. మెట్ట భూముల్లో శనగ పైరు వేసుకుంటే ఎంతో లాభదాయకమని ఏఓ పేర్కొన్నారు. వర్షానికి పట్టణంలోని వివిధ వాగులు, భారీ డ్రైనేజీలు పొంగి పొర్లాయి. శివనగర్ కాలనీ, సాయినగర్ కాలనీలు పల్లపు ప్రాంతాలు కావడంతో వీధుల్లో నీరు నిలిచింది. పలువాగుల్లో నీరు రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆయా వాగులను నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పరిశీలించారు. సమస్యను పరిష్కరిస్తామన్నారు.
పీసీపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా వర్షం లేకపోవడంతో రైతులు సాగుచేసిన పంటలకు ఈ వర్షం జీవం పోసింది. కంది, మినుము, పత్తి పైర్లు జీవంపోసుకున్నాయి. సీ.ఎస్.పురం మండలంలోనూ సాయంత్రం వేళ వర్షం కురిసింది.