ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-05-26T06:29:18+05:30 IST

అనకాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బుధవారం వేకువజాము 5 గంటల వరకు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.

ముంచెత్తిన వాన
అనకాపల్లి విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి కింద నీళ్లలో నిలిచిపోయిన ప్రైవేటు బస్సును క్రేన్‌తో బయటకు తీస్తున్న దృశ్యం

రికార్డు స్థాయిలో సగటున 74.8 ఎంఎం వర్షపాతం నమోదు

లోతట్టు ప్రాంతాలు జలమయం

విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

ఇబ్బందులకు గురైన జనం

అనకాపల్లిటౌన్‌, మే 25: అనకాపల్లిలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బుధవారం వేకువజాము 5 గంటల వరకు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 74.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు, చెట్లకొమ్మలు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూడిమడక రోడ్డులోని బైపాస్‌ జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ చెరువులను తలపించాయి. కాంప్లెక్స్‌ ఆవరణలో కూడా ఈదురుగాలుల ప్రభావం వల్ల చెట్లు నేలకొరిగాయి. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో అనకాపల్లి-చోడవరం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రైవేటు కంపెనీ బస్సు నీటిలోంచి వచ్చి అండర్‌బ్రిడ్జి కింద చిక్కుకుపోయింది. ఆఖరికి క్రేన్‌ సహాయంతో బస్సును బయటకు తీశారు. భారీ వాహనాలు బ్రిడ్జి కింద నుంచి రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు నాయుళ్లవీధి, లక్ష్మీదేవిపేట రైల్వేగేటు మీదుగా ట్రాఫిక్‌ మళ్లించారు. అయితే రైళ్ల రాకపోకల సమయాల్లో గేటు వేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కాగా శారదానది మార్గంలో ప్రధాన రహదారికి పల్లంలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయం ముంపునకు గురైంది. దీంతో కార్యాలయంలోని పలు పత్రాలు తడిసి ముద్దయ్యాయి. అధికారులు తక్షణమే స్పందించి తడిసిన పత్రాలను కార్యాలయం ముందు ఎండలో ఆరబెట్టారు. పరమేశ్వరిపార్కు జంక్షన్‌, శ్రీరామనగర్‌కాలనీ, లక్ష్మీదేవిపేట, ఎన్టీఆర్‌ వైద్యాలయం మార్గంలో వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. 

అంధకారంలో అనకాపల్లి

ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా విడతలవారీగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు పునరుద్ధరణకు నోచుకోలేదు. సాయంత్రం నాలుగు గంటలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కాగా చోడవరంలో మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి సుమారు రెండు గంటల సేపు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎలమంచిలిలో కూడా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మునగపాకలో..

మునగపాక: మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. రికార్డుస్థాయిలో 92.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల చెట్లు కూలి విద్యుత్‌ వైర్లపై పడటంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. కోతకు వచ్చిన పొద్దు తిరుగుడు పంట పూర్తిగా నేలమట్టమైంది. మామిడికాయలు పూర్తిగా గాలికి పడిపోయాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు 18 గంటల పాటు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో కుళాయిలు రాక తాగునీరు లేక అవస్థలు పడ్డారు. 

Updated Date - 2022-05-26T06:29:18+05:30 IST