భారీవర్షం
ABN , First Publish Date - 2022-10-07T06:10:14+05:30 IST
నగరంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో పడిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నగరంలో పల్లపు ప్రాంతాలు జలమయం
కృష్ణాపురంలో ఇళ్లలోకి నీరు
తొమ్మిదో తేదీ వరకూ కొనసాగుతాయంటున్న అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో పడిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం తెల్లవారుజామున భారీవర్షం పడడంతో కొత్త సెంట్రల్ జైలు సమీపానున్న రామకృష్ణాపురంలో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ప్రధాన కాలువను ఆనుకొని చాలామంది ఇళ్లు నిర్మించుకోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి వరద ముంచెత్తుతోంది. ప్రజలు భయపడి తలుపులన్నీ వేసుకుంటున్నా ప్రయోజనం వుండడం లేదు. ఇటుచూస్తే పెందుర్తి సమీప ప్రాంతాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. నగరంలో కాన్వెంట్ జంక్షన్ వద్ద మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. రైల్వే న్యూకాలనీలోని పలు వీధుల్లో ఎటుచూసినా వర్షపునీరే కనిపించింది. దసరా రోజు కూడా అడపాదడపా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షాలు తొమ్మిదో తేదీ వరకూ కొనసాగుతాయని, అప్రమత్తంగా వుండాలని జిల్లా అధికారులు సూచించారు. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.