కేరళలో భారీవర్షాలు...orange alert issued
ABN , First Publish Date - 2022-05-17T17:15:30+05:30 IST
కేరళ రాష్ట్రంలో మంగళవారం భారీవర్షాలు కురుస్తున్నాయి....
తిరువనంతపురం(కేరళ): కేరళ రాష్ట్రంలో మంగళవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ద్వీపకల్పానికి బలమైన గాలుల ప్రభావం కారణంగా కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో ఆయా జిల్లాల్లో మంగళవారం ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు.రానున్న కొద్దిరోజుల పాటు కేరళ, లక్షద్వీప్లలో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.కేరళ తీరంలోని సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణాదిలోని కోస్తా, కొండ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు.కొట్టాయంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది, నదులు పొంగిపొర్లాయి. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. భారీవర్షాల నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఆపదలో ఉన్న వ్యక్తులు 1077కు కాల్ చేయవచ్చని అధికారులు చెప్పారు.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి 24 గంటల పాటు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.