రోజంతా వాన
ABN , First Publish Date - 2020-12-04T04:55:00+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బురేవి తుపానుగా మారడంతో ఆ ప్రభావంతో నెల్లూరు నగరంలో మళ్లీ వానలు కురుస్తున్నాయి. గురువారం రోజంతా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది.
ప్రధాన ప్రాంతాలు జలమయం
ప్రజలకు తప్పని అవస్థలు
నగర వాసుల్లో బురేవి భయం
నెల్లూరు (సిటీ), డిసెంబరు 3 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బురేవి తుపానుగా మారడంతో ఆ ప్రభావంతో నెల్లూరు నగరంలో మళ్లీ వానలు కురుస్తున్నాయి. గురువారం రోజంతా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులతోపాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇటీవల సంభవించిన నివర్ తుపానుతో అతలాకుతలం అయిన లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మళ్లీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజా వర్షాలతో బుజబుజనెల్లూరులోని పలు కాలనీలు, మనుమద్ధినగర్, భగత్సింగ్ కాలనీ, పరమేశ్వరీ నగర్, కొత్తూరు, పడారుపల్లి, బీవీనగర్, ఆదిత్యనగర్, మాగుంటలేఅవుట్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలువలు పొంగి రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహిస్తోంది.