Heavy rains: భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , First Publish Date - 2022-08-09T02:06:03+05:30 IST
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలతో గోదావరి (Godavari) నీటిమట్టం
పోలవరం: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలతో గోదావరి (Godavari) నీటిమట్టం సోమవారం నాటికి క్రమంగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి 36.10 అడుగుల నీటి మట్టానికి చేరుకొంది. కాగా కుక్కునూరులోని గుండేటి వాగు మీద ఉన్న లోలెవల్ కాజ్వే నీట మునిగింది. 20 రోజులుగా నీట మునిగి ఉన్న కాజ్వే నాలుగు రోజుల క్రితం బయటపడింది. మళ్లీ అంతలోనే గోదావరి వరద పెరగడంతో నీట మునిగి కుక్కునూరు-దాచారం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వయా నల్లగుంట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగులు, శబరి, ఇంద్రావతి, సీలేరు వంటి ఉప నదుల వరద జలాలు గోదావరిలో కలుస్తుండడం వల్ల నీటిమట్టం పెరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు (Polavaram project) స్పిల్ వే ఎగువన, ఎగువ కాపర్ డ్యాం ఎగువన గోదావరి నీటిమట్టం 30.840 మీటర్లు, దిగువ కాపర్ డ్యాం, స్పిల్ వే దిగువన 21.710 మీటర్లు, పోలవరం వద్ద 21.387 మీటర్లు నమోదైంది. అదనంగా వస్తున్న 3,52,502 క్యూసెక్కుల వరద జలాలను జలవనరులశాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు.