రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-12-10T16:15:47+05:30 IST

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే..

రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే.. మరో ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో నిక్షిప్తమైందని వాతావరణ శాఖ తెలిపింది.


తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్ప మార్పులు ఉంటాయని వివరించారు.


ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2021-12-10T16:15:47+05:30 IST