కుండపోతగా వాన!

ABN , First Publish Date - 2022-09-24T06:44:10+05:30 IST

పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

కుండపోతగా వాన!
వర్షపు నీరు నిలిచిపోయి చెరువులా మారిన అచ్యుతాపురం మెయిన్‌ రోడ్డు

అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో భారీ వర్షం

డ్రైనేజీలు పొంగడంతో కాలువలుగా మారిన రోడ్లు

లోతట్టు ప్రాంతాలు జలమయం

చెరువును తలపించిన అచ్యుతాపురం జంక్షన్‌

మునగపాక మండలంలో పిడుగులు పడి ఆవు, గేదె మృతి

ఎలమంచిలిలో గంటపాటు నిలిచిన విద్యుత్‌ సరఫరా

అనకాపల్లి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగడంతో రహదారులు పంట కాలువలను తలపించాయి. ఆయాప్రాంతాల్లో రాకపోకలకు వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు.


--

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 23 : పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ మండినప్పటికీ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై కుండపోతగా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్‌ వైద్యాలయం ఎదుట, ఆర్టీసీ కాంప్లెక్స్‌, సాధువుల గుడి, గవరపాలెంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువల్లో పూడికలు తీయకపోవడంతో వర్షపు నీరుచేరి రహదారులు పలుచోట్ల దుర్భరంగా మారాయి. విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనచోదకుల అవస్థలు వర్ణనాతీతం.  58 ఎం.ఎం. వర్షపాతం నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.

అచ్యుతాపురం జంక్షన్‌ జలమయం

అచ్యుతాపురం, సెప్టెంబరు 23: మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కుండపోతగా వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రహదారులు కాలువలను తలపించాయి. అచ్యుతాపురం జంక్షన్‌లో డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షపునీటితో చెరువులా మారింది.  ఇదే సమయంలో పాఠశాలలను విడిచిపెట్టడంతో విద్యార్థులతోపాటు ఇతర పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 

ఎలమంచిలిలో..

ఎలమంచిలి, సెప్టెంబరు 23: పట్టణంలో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. పల్లపు  ప్రాంతాల్లోని వీధుల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. మురుగునీటి కాలువలు పొంగి రహదారులపై ప్రవహించాయి. దీంతో రోడ్లపై బురద, చెత్తాచెదారం పేరుకుపోయింది. యర్రవరం సమీపంలో విద్యుత్‌ వైరు తెగిపోవడంతో సుమారు గంటపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

పిడుగుపడి ఆవు, గేదె మృతి

మునగపాక, సెప్టెంబరు 23: మండలంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగులు పడడంతో ఒంపోలులోని బొద్దపు సూర్యనారాయణమ్మకు చెందిన ఆవు, ఉమ్మలాడలో కోరిబిల్లి నాగేశ్వరరావుకు చెందిన గేదె మృతిచెందాయి. 


Updated Date - 2022-09-24T06:44:10+05:30 IST