తెలి మంచు కరిగింది...
ABN , First Publish Date - 2022-01-23T05:33:42+05:30 IST
తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ..
10 గంటల వరకూ పొగమంచు
వాహనదారులకు ఇబ్బందులు
పాలకొల్లుఅర్బన్/ పాలకోడేరు/ ఆచంట/ నరసాపురం, జనవరి 22 : తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రబు.. స్వాతికిరణం సినిమాలో ఇదీ ఒక కవి వర్ణన.. అచ్చంగా గత వారం రోజులుగా జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడడంలేదు. పొగ మంచు కమ్మేస్తోంది. నరసాపురం– పాలకొల్లు, ఆచంట, పాలకోడేరు ఇటు తీర ప్రాంత రహదారుల్లోనూ ఇదే పరిస్థితి. గోదావరి నదిపై కూడా మంచు దుప్పటి కప్తేస్తోంది. ఉత్తరాయణం ప్రారంభమై వారం రోజులైనప్పటికీ ఒక వైపు చలి, మరో వైపు మంచు కురుస్తూనే ఉంది. శనివారం తెల్ల వారు జాము నుంచి విపరీతంగా మంచు కురి సింది. ఉదయం 10 గంటల వరకూ వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదు. ఉదయం 10 గంటలైనా మంచు కురుస్తూనే ఉండడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బందిపడినా ప్రకృతి అందాలను తిలకిస్తూ ప్రయాణాలు సాగించారు.ఉదయం 9 గంటలకు భానుడు వచ్చినా మంచు మాత్రం అడ్డు తొలగలేదు. దీని వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాత్రి 18 నుంచి 20 డిగ్రీలు నమోదవుతున్నాయి. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో మంచు కురుస్తున్నా లెక్కచేయకుండా ఓ వైపు కూలీలు నారు తీస్తుంటే మరో వైపు నాట్లు వేస్తూ కనిపించారు.