హెలికాప్టర్ శకలాల తొలగింపు
ABN , First Publish Date - 2021-12-25T16:12:21+05:30 IST
కున్నూర్ సమీపంలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ శకలాలను చిన్న భాగాలుగా వేరుచేసి సైనికులు బయటకు తీసుకొస్తున్నారు. నీలగిరి జిల్లా కున్నూర్ సమీపం నంజప్పసత్రంలో ఈ నెల 8న హెలికాప్టర్
పెరంబూర్(చెన్నై): కున్నూర్ సమీపంలో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ శకలాలను చిన్న భాగాలుగా వేరుచేసి సైనికులు బయటకు తీసుకొస్తున్నారు. నీలగిరి జిల్లా కున్నూర్ సమీపం నంజప్పసత్రంలో ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ సహా 14 మంది మృతిచెందారు. ఈ ఘటనపై వైమానిక దళం, రాష్ట్ర పోలీసు శాఖలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి. ప్రస్తుతం ఘటనా ప్రాంతం నుంచి హెలికాప్టర్ శకలాలను తొలగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి శకలాలను బయటకు తీసుకొచ్చేందుకు రోడ్డు, బాట లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, శకలాల భాగాలను విడిదీసి వాటిని సుమారు 1.5 కి.మీ దూరం వరకు మోసి సైనికులు బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం హెలికాప్టర్ వెనుక భాగం రోడ్డు వరకు తెచ్చి లారీల ద్వారా కోవైకు తరలించారు. హెలికాప్టర్ ఇంజన్ మధ్య భాగం అధిక బరువు ఉండడంతో భారీ క్రేన్ అవసరం ఉండడంతో ప్రస్తుతం రోడ్డు వేసే చర్యలపై వైమానిక దళ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
దివంగత దళపతికి తర్పణం..
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన దివంగత త్రివిధ దళాధికారి బిపిన్ రావత్ సహా 14 మందికి 16వ రోజైన గురువారం కోయంబత్తూర్ జిల్లాలోని నొయ్యాల్ నది తీరంలో తర్పణం వదిలారు. భట్టాచార్యులు వరదరాజన్, కులశేఖర రామనుజం సంప్రదాయం ప్రకారం తర్పణం వదిలి అన్నదానం చేశారు. ఇలాంటి విపత్తుల భవిష్యత్తులో పునరావృతం కారా దని, మృతుల ఆత్మ శాంతించి వైకుంఠ ప్రాప్తి కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు భట్టాచార్యులు తెలిపారు.