హలో.. సోమేశ్‌కుమార్‌ను మాట్లాడుతున్నా!

ABN , First Publish Date - 2020-12-03T07:07:33+05:30 IST

ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయడం లేదంటూ ఓ యువ రైతు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం, అది వైరల్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ

హలో.. సోమేశ్‌కుమార్‌ను  మాట్లాడుతున్నా!

 ధాన్యం కొనడం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన రైతుకు ఫోన్‌ చేసిన సీఎస్‌

 వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు

నెన్నెల, డిసెంబరు 2: ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయడం లేదంటూ ఓ యువ రైతు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం, అది వైరల్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్పందించారు. ఆయన స్వయంగా రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. సత్వరమే ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.


మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన కొండపల్లి శరత్‌ ఏడెకరాల్లో సన్న రకం వరి సాగు చేశాడు. సుమారు 140 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతలు పూర్తి చేసుకొని 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, వ్యాపారులు కొనుగోలుకు మందుకు రాకపోవడంతో ధాన్యం రాశి వద్దే పడిగాపులు కాశాడు. ధాన్యానికి ధర లభించకపోవడం, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, వ్యాపారులు ధర తగ్గించి అడగడం వంటి వివరాలను సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి ‘మన వ్యవసాయం, మన పంటలు’ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు.


ఈ వీడియో వైరల్‌ అయింది. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నేరుగా శరత్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. శరత్‌ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం రైస్‌మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి శరత్‌ ధాన్యాన్ని కాంటా వేశారు. మండలంలో వెంటనే ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంతో సీఎ్‌సకు, కలెక్టర్‌కు శరత్‌ కృతజ్ఞతలు తెలిపారు.


గతంలో సీఎం కేసీఆర్‌ కూడా.. 

గత ఏడాది మార్చి నెలలో తన భూ సమస్య గురించి శరత్‌ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా సీఎం కేసీఆర్‌ స్పందించి శరత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అప్పట్లో అది సంచలనమైంది. రెండు రోజుల్లో శరత్‌ సమస్య పరిష్కారమైంది. 


Updated Date - 2020-12-03T07:07:33+05:30 IST