దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-22T05:09:09+05:30 IST

రాజమహేంద్రవరంలో ముఖ్యమైన కూడళ్లు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్టు అర్బన్‌ జిల్లా ఈస్ట్‌జోన్‌ ఇన్‌చార్జి అడిషనల్‌ ఎస్పీ ఏటీవీ రవికుమార్‌ తెలిపారు.

దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21: రాజమహేంద్రవరంలో ముఖ్యమైన కూడళ్లు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్టు అర్బన్‌ జిల్లా ఈస్ట్‌జోన్‌ ఇన్‌చార్జి అడిషనల్‌ ఎస్పీ ఏటీవీ రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ ఆర్‌జే రవికుమార్‌, ఎస్‌ఐ హరిబాబులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ మాట్లాడుతూ దాతల సహకారంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని పశ్చిమగోదావరి ప్లాట్‌పామ్‌ పైనా, బస్టాండ్‌ ప్రాంగణంలో 5 మెగా పిక్సల్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 14 అపార్టుమెంట్స్‌లో 122 సీసీ కెమెరాలు, 13 షాపుల్లో 40, పెట్రోల్‌ బంక్‌లలో 4, హాస్పిటల్స్‌లో 4, షాపింగ్‌ మాల్స్‌లో 9 ముఖ్యమైన సెంటర్ల కలిపి స్టేషన్‌ పరిధిలో 179 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీఐ లక్ష్మణ్‌రెడ్డి, ఎస్‌ఐలు కె.రమేష్‌, ఆర్‌.శివాజీ, కె.జగన్‌ మోహనరావు సిబ్బంది కలిసి దాతల సహకారంతో వివిధ ప్రాంతాల్లో 58 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్‌ఐలు జుబైర్‌మహమ్మద్‌, వై.సుధాకర్‌, సీహెచ్‌ సుమన్‌ సిబ్బందితో కలిసి దాతల సహకారంతో ముఖ్యమైన ప్రాంతాల్లో 102 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాల మేరకు అర్బన్‌ జిల్లా పరిధిలో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-01-22T05:09:09+05:30 IST