నా కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టండి : ఓ తండ్రి వేడుకోలు
ABN , First Publish Date - 2021-06-18T06:11:01+05:30 IST
చక్కగా చదువుకుంటూ ఎంతో హుషారుగా ఉన్న కుమార్తె హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్ళగా క్యాన్సర్ బారిన పడిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు హతుశులయ్యారు.
రామకుప్పం, జూన్ 17: చక్కగా చదువుకుంటూ ఎంతో హుషారుగా ఉన్న కుమార్తె హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్ళగా క్యాన్సర్ బారిన పడిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు హతుశులయ్యారు. వైద్యం కోసం తమ దగ్గరున్నంత డబ్బును వెచ్చించారు. ఆమె ప్రాణాలతో బయటపడాలంటే పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించి తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని రామకుప్పం మండలం విజలాపురానికి చెందిన పళని వేడుకుంటున్నాడు. ఆయన కథనం మేరకు ...విజలాపురానికి చెందిన పళని కుమార్తె పూజ పదోతరగతి చదువుతోంది. ఇటీవల ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుప్పం ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి బ్లడ్కాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పూజను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె క్యాన్సర్ నుంచి బయటపడాలంటే రూ.15లక్షలు వరకు అవుతుందని తెలిపారు. తమ వద్ద ఉన్న డబ్బు పూజ వైద్యపరీక్షలు, మందులకే సరిపోవడంతో ఆమె తండ్రి పళని దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. దయగల దాతలు 9908589030 నెంబరుకు ఫోన్పే చేయాలని ఆయన అర్థించాడు. కాగా పూజ త్వరగా కోలుకోవాలని కోరుతూ వైసీపీ మండల కో-కన్వీనర్ చంద్రారెడ్డి, రామకుప్పం సర్పంచు మురళీకృష్ణ రూ.10వేలు చొప్పున, వైసీపీ మండల ప్రచారకార్యదర్శి కేశవరెడ్డి రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు.