రమ్మన్నారు.. వెళ్లాక లేదన్నారు

ABN , First Publish Date - 2020-07-07T07:41:55+05:30 IST

ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు..మీకు ఉద్యోగం వచ్చింది..ఫలానా రోజు నుంచి విధులకు హాజరు కావాలి అని సందేశం వచ్చింది..అదీ చూసుకొని వెళ్తే తీరా ఇక్కడ ఉద్యోగం లేదు అంటే ఎట్లా ఉంటుంది. ఇటువంటి చేదు అనుభవమే టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌)

రమ్మన్నారు.. వెళ్లాక లేదన్నారు

అడ్డగుట్ట/మంగళ్‌హాట్‌ జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు..మీకు ఉద్యోగం వచ్చింది..ఫలానా రోజు నుంచి విధులకు హాజరు కావాలి అని సందేశం వచ్చింది..అదీ చూసుకొని వెళ్తే తీరా ఇక్కడ ఉద్యోగం లేదు అంటే ఎట్లా ఉంటుంది. ఇటువంటి చేదు అనుభవమే టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌) ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ నర్సు ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు ఎదురైంది. అంతేకాకుండా ఇక్కడ కాదు అక్కడ ఉద్యోగం అంటూ పరుగు పెట్టించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో నర్సులుగా ఏడాదిపాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధుల నిర్వహించడం కోసం దాదాపు 600 మందికి గత శుక్రవారం ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో 246 మందిని ఎంపిక చేసి సోమవారం నుంచి విధుల్లో చేరాలని మేసేజ్‌లు పంపారు. దీంతో వీరిలో 120 మంది సోమవారం టిమ్స్‌ ఆస్పత్రికి వెళ్ళారు. ఎంతో ఆశతో వెళ్లిన వారికి అక్కడ నిరాశే ఎదురైంది. ఇక్కడకెందుకొచ్చారు..ఎవరూ మిమ్మల్ని రమ్మన్నారని అక్కడి అధికారులు ప్రశ్నించడంతో అవాక్కయ్యారు. ఇక్కడ ఖాళీలు లేవని మీరందరూ గాంధీ ఆస్పత్రిలో పని చేయాలని టిమ్స్‌ వైద్యులు వచ్చిన అభ్యర్థులకు సూచించారు. దీంతో చేసేదేమీలేక వారంతా గాంధీ ఆస్పత్రికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అయితే అక్కడ కూడా వారికి చేదు అనుభవమే ఎదురైంది. మిమ్మల్ని ఇక్కడ పని చేయించుకునేందుకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు లేవనీ గాంధీ వైద్యాధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో  ఏం చేయాలో తమ సమస్య ఎవరికి చెప్పాలో తెలియక రెండు గంటలపాటు గాంధీ మెడికల్‌ కాలేజీ మైదానంలో నిరీక్షించి వెళ్లిపోయారు. వీరు కాకుండా ఎంపికయిన మరో 30 మందికి  ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వహించాలని టిమ్స్‌ అధికారులు సూచించారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపాదిక పని చేసేందుకు ఎంపిక చేసిన మమ్మల్ని ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాల్లో చేరాలనడంపై వారు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కోఠిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌  (డీఎంఈ) కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-07T07:41:55+05:30 IST