అంబులెన్స్లను ఎందుకు ఆపుతున్నారు?: టీసర్కారుపై హైకోర్టు ఫైర్
ABN , First Publish Date - 2021-05-11T17:28:44+05:30 IST
హైదరాబాద్: ఇంటర్ స్టేట్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్లను ఎందుకు అవుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ : ఇంటర్ స్టేట్ బార్డర్స్ నుంచి వస్తున్న అంబులెన్స్లను ఎందుకు అవుతున్నారని కేసీఆర్ సర్కార్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్టాల నుంచి అంబులెన్స్లో వస్తున్న వారికి టెస్టులు చేయమని మాత్రమే చెప్పామని... వారిని ఆపమని మీకు ఎవరు చెప్పారంటూ హైకోర్టు ఫైర్ అయింది. హైదరాబాద్, రంగారెడ్డిలలో కేసులు తగ్గాయని ఎలా చెపుతున్నారని ప్రశ్నించింది. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారంటూ మండిపడింది. పాతబస్తి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకూ ఏజీ సమయం కోరారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అంబులెన్సుల్లో వచ్చిన కొవిడ్ రోగులను తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకున్న విషయం విదితమే. ఇతర వాహనాలను, ఇతర రోగులను తీసుకెళ్తున్న అంబులెన్సులను అనుమతిస్తున్నా.. కొవిడ్ రోగులతో వచ్చే అంబులెన్సులను మాత్రం వెనక్కి పంపడంతో సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అంబులెన్సులు నిలిచిపోయాయి.