AP : మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్

ABN , First Publish Date - 2021-08-04T16:58:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ వచ్చింది...

AP : మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ వచ్చింది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు పెట్టి అరెస్ట్ అయిన విషయం విదితమే. ఈ కేసులో బుధవారం ఉదయం ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజుల పాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు. కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు.


ఆయన అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించి.. ధర్నాలు, నిరసనలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే.. దేవినేని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా మైలవరంలో మైనింగ్ వివాదం గత కొన్ని రోజులుగా రచ్చ రాజేసింది. ఈ విషయంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కాస్త ప్రత్యక్ష దాడి వరకూ వెళ్లింది.

Updated Date - 2021-08-04T16:58:33+05:30 IST