టీఆర్ఎస్ నేత ఇంటిని కూల్చివేసేందుకు యత్నం
ABN , First Publish Date - 2021-01-25T18:16:53+05:30 IST
మేడ్చల్ జిల్లా: యాప్రాల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నివాసం ఉండే టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు..
మేడ్చల్ జిల్లా: యాప్రాల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నివాసం ఉండే టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మధుసూదన్ రెడ్డికి చెందిన ఇంటిని అక్రమ నిర్మాణం పేరుతో అధికారులు కూల్చివేయడానికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బందోబస్తు మధ్య ఆయన నివాసం కూల్చివేతకు సోమవారం ఉదయం నుంచి హడావుడి కొనసాగుతోంది. యాప్రాల్లో అన్ని ఇళ్ల నిర్మాణాలు ఉన్నా.. తన ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారని మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా ఘటనా స్థలికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగిన నేరేడ్మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనలమేరకే తన ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు వచ్చారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యే మాట విననందుకు కక్ష కట్టారని, పోలీసులతో హౌస్ అరెస్టు చేయించి మరీ ఇల్లు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హనుమంతరావు నుంచి తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని మధుసూదన్ రెడ్డి కోరారు.