ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2021-07-27T05:11:43+05:30 IST
ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా రీసెర్చ్ కోఆర్డినేటర్లు సోహైల్, చంద్రమౌళీశ్వరరెడ్డి పేర్కొన్నారు.
పులివెందుల రూరల్, జూలై 26: ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా రీసెర్చ్ కోఆర్డినేటర్లు సోహైల్, చంద్రమౌళీశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ఉలిమెల్ల గ్రామంలో 30సెంట్ల స్థలంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడులు మరింత తగ్గించే విధంగా ఘన జీవామృతం ప్రయోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటు ఆవు పచ్చిపేడ, శనగపిండి, పప్పుదినుసులు తదితర వాటితో తయారు చేసిన ఘనజీవామృతంతో టైప్-1, జీవామృతం, దిబ్బఎరువులు తదితర వాటితో తయారు చేసిన ఘనజీవామృతంతో టైప్-2 ప్రయోగాన్ని నిర్వహించామన్నారు. ఈ ప్రయోగంలో మొక్క నాటిన తర్వాత నుంచి ఎదిగే కొద్దీ భూమిసాంద్రత, వానపాముల సంఖ్య, భూమిలో ఉష్ణోగ్రత, భూసా రం, భూమి నీరు పట్టి ఉంచే గుణం రీడింగ్లు తీసుకుంటామన్నారు. దీంతో ఏ రకం ఘనజీవామృతంతో పంట దిగుబడి, నాణ్యత, భూమి సారవంత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. తద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తెలియజేసి వారిని ప్రోత్సహిస్తామన్నారు. 30సెంట్ల స్థలాన్ని ప్లాటు ్లగా విడగొట్టి టమోట, మొక్కజొన్న, ముల్లంగి, ఆముదం పంటలు వేసి టైప్-1, టైప్-2 ఘనజీవామృతాలతో పంటలు సాగుచేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి ఆరోగ్యకరమైన పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డివిజన్ మాస్టర్ ట్రైనర్ మస్తాన్, ఇంటర్నల్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ పద్మావతి, జగన్, రైతులు పాల్గొన్నారు.