పాకిస్థాన్లో హిందూ బాలిక కిడ్నాప్... కిడ్నాపర్తోనే బలవంతపు పెళ్లి...
ABN , First Publish Date - 2021-03-12T22:38:41+05:30 IST
పాకిస్థాన్లో మైనారిటీ హిందువుల బలవంతపు మత మార్పిడి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో మైనారిటీ హిందువుల బలవంతపు మత మార్పిడి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. మార్చి 8న ఓ పదమూడేళ్ళ బాలికను ఐదుగురు సాయుధులు కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తితోనే పెళ్లి చేసినట్లు తెలుస్తోంది.
సౌత్ ఆసియా మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సింధ్ ప్రావిన్స్లోని తంగ్వని తాలూకాలో పదమూడేళ్ల హిందూ బాలికను ఐదుగురు సాయుధులు మార్చి 8న ఆమె ఇంటి నుంచి బలవంతంగా లాక్కెళ్ళారు. ఆమెను ఇస్లాంలోకి మార్చి, ఆ తర్వాత కిడ్నాపర్తోనే పెళ్లి చేశారు. బరేల్వీ మత పెద్ద మియా మిఠూ ఆమెను మతం మార్చాడు.
బాలికను మతం మార్చడానికి నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా ఈ ఇన్స్టిట్యూట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బాధితురాలి తండ్రి కూడా ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించి, సింధ్ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.