రైస్మిల్లర్ల హైరానా
ABN , First Publish Date - 2022-05-26T05:42:19+05:30 IST
కస్లమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందించని రైస్మిల్లుల యజమానులకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఐదు సార్లు గడువు ఇచ్చినా స్పందించకపోవడంతో నిషేధం విధిస్తామని హెచ్చరించింది.
ఫ సీఎంఆర్ ఇవ్వడంలో అలసత్వంపై ప్రభుత్వం సీరియస్
ఫ నిషేధం విధిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు
ఫ అడిషనల్ కలెక్టర్, డీఎస్వో, డీఎం, అధికారుల స్పెషల్ డ్రైవ్
ఫ ఇప్పటికే ఐదుసార్లు గడువు పెంపు.. ఈ నెల 30 చివరి అవకాశం
కామారెడ్డి, మే 25: కస్లమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందించని రైస్మిల్లుల యజమానులకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఐదు సార్లు గడువు ఇచ్చినా స్పందించకపోవడంతో నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దీంతో రైస్మిల్లుల యజమానులు హైరానా పడుతున్నారు. ఈనెల 30 వరకు అవకాశం కల్పించగా అద నపు కలెక్టర్, డీఎస్వో, డీఎం స్థాయి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈసారి మాత్రం గడువుపెంచే అవకాశం లేదని యం త్రాంగం పేర్కొంటుంది.
రైస్మిల్లర్లకు నోటీసులు
జిల్లాలో 2021-22 యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యం పెండింగ్ చాలానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2021 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు సీఎంఆర్ పెండింగ్ గడువును పెంచినప్పటికీ సంబంధిత రైస్మిల్లర్లు ఆ బియ్యాన్ని అప్పగించలేదు. దీంతో ఈ సారి చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2021-22 యాసంగికి సంబంధించిన బియ్యాన్ని రైస్మిల్లర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా కొన్ని రైస్మిల్లుల నిర్వాహకులు సీఎంఆర్ను అప్పగించకపోవడంతో సత్వరమే సీఎంఆర్ బియ్యం అప్పగించాలని కోరుతూ అధికారులు రైస్మిల్లర్లకు నోటీసులు కూడా జారీ చేశారు.
లక్ష్యం కోసం స్పెషల్ డ్రైవ్
జిల్లాలో సీఎంఆర్ బియ్యం పెండింగ్పై జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో పాటు డీఎస్వో రాజశేఖర్ రైస్మిల్లులకు కేటాయించిన ధాన్య ంలో తిరిగి రావాల్సిన సీఎంఆర్ బియ్యం, పెండింగ్లో ఉన్నదాన్ని గుర్తించారు. పెండింగ్ బియ్యాన్ని వెంటనే ఎఫ్సీఐకి అప్పగించేలా చర్య లు తీసుకుంటున్నారు. మిల్లింగ్ చేసి ఏ రోజుకా రోజు బియ్యం రిపోర్టును తీసుకుంటూ ఎఫ్సీఐ అధికారులకు నివేదిక రూపంలో అందజేస్తున్నారు. ఈ నెల 30లోపు గడువు ఉన్న నేపథ్యంలో సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్మిల్లులకు ఈ యాసంగికి సంబంధించిన ధాన్యం కూడా అప్పగించబోమని వారికి సూచన ప్రాయ ంగా తెలుపుతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ప్రతిరోజూ దీనిపై జిల్లాల వారీ గా నివేదికను కోరనున్న నేపథ్యంలో రోజువారి పురోగతిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఫ రాజశేఖర్, డీఎస్వో, కామారెడ్డి
ఈనెల 30లోపు సీఎంఆర్ పెండింగ్ బియ్యం ఇవ్వాల్సిం దే. జిల్లాలో యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం రైస్మిల్లుల నుంచి సేకరిస్తున్నాం. ఇందు లో 2021-22 సంవత్సరానికి గాను రావాల్సిన బియ్యం గడువులోపు ఇవ్వాలని రైస్మిల్లర్లను ఆదేశించాం.