మొసలి దాడి.. పశువుల కాపరి దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-01T09:39:05+05:30 IST
నీళ్లలోకి దిగి బర్లను కడుగుతుండగా పశువుల కాపరిపై మొసలి దాడి చేసింది. దీంతో ఆ పశువుల కాపరి మృతి చెందాడు.
మెదక్ జిల్లా మంజీరా నది వద్ద ఘటన
పుల్కల్, ఫిబ్రవరి 28: నీళ్లలోకి దిగి బర్లను కడుగుతుండగా పశువుల కాపరిపై మొసలి దాడి చేసింది. దీంతో ఆ పశువుల కాపరి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతుడు ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45). మొసలి దాడి చేసినప్పుడు ఒడ్డుపై ఉన్న సహచర పశువుల కాపరులు తమ వద్ద ఉన్న కర్రలతో ఒడ్డుపై నుంచే నీళ్లపై గట్టిగా కొడుతూ అరుపులు, కేకలు వేశారు. అయినా రాములును మొసలి విడిచిపెట్టలేదు. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది.