పాక్లో ఎన్నికలు నిర్వహించండి
ABN , First Publish Date - 2022-05-27T06:53:15+05:30 IST
పాకిస్థాన్లో ప్రావిన్స్ అసెంబ్లీలను రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలని..
అసెంబ్లీలను రద్దు చేయాలి.. ప్రభుత్వానికి ఇమ్రాన్ 6 రోజుల డెడ్లైన్
ఇస్లామాబాద్, మే 26: పాకిస్థాన్లో ప్రావిన్స్ అసెంబ్లీలను రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఆరు రోజులు డెడ్లైన్ విధించారు. ఈలోగా ప్రకటన చేయకపోతే ‘యావత్ దేశం’తో మళ్లీ ఇస్లామాబాద్కు వస్తానని హెచ్చరించారు. గురువారం పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించింది. ఇమ్రాన్ తన మద్దతుదారులతో భారీ ర్యాలీగా ఇస్లామాబాద్కు రావడంతో పాక్ ప్రభుత్వం రాజధానిలో సైన్యాన్ని మోహరించింది. సుప్రీం కోర్టు, పార్లమెంట్, ప్రధాని నివాసం, అధ్యక్ష భవనం, సెక్రటేరియట్, దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలని ఆదేశించింది. కాగా ఇమ్రాన్ ఖాన్పై ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆజాదీ మార్చ్కు సంబంధించి కోర్టు ఆదేశాలను ఇమ్రాన్ పార్టీ (పీటీఐ) ఉల్లంఘించిందని ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.